వైసీపీ అధినేత జగన్కు ప్రతిపక్ష నేత హోదా కల్పించడంలో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆటంకాలు సృష్టిస్తోందని మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రంగా విమర్శించారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన, జగన్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే సత్తా ఉంటే ప్రభుత్వం వెంటనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని, లేదంటే తమ బలహీనతను అంగీకరించాలని సవాల్ విసిరారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడంపై ప్రభుత్వానికి ఎందుకంత భయం ఉందో ప్రజలకు స్పష్టంగా కనిపిస్తోందని ఆయన అన్నారు. జగన్ అడిగే ప్రశ్నలకు తాము జవాబు చెప్పలేమనే ఆందోళనతోనే చంద్రబాబు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని, అందుకే న్యాయపోరాటం కోసం కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని పేర్ని నాని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కూటమి పాలన తీరు ఇప్పటికే ప్రజలకు అర్థమైపోయిందని, ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా విజయమే వైసీపీదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజల మద్దతు తమకే ఉందని, భవిష్యత్లో ఏ ఎన్నికలకైనా సిద్ధంగా ఉన్నామనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్ అధ్యక్షతన వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, పీఏసీ సభ్యులు, జిల్లా అధ్యక్షులతో పాటు పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు హాజరయ్యారు. ఈ భేటీలో పార్టీ భవిష్యత్ కార్యాచరణ, ప్రజా సమస్యలపై పోరాటాలపై సవివరంగా చర్చించారని సమాచారం. వైసీపీ బలాన్ని మరింత పెంపొందించే దిశగా, ప్రజల్లో పార్టీ స్థాయిని బలోపేతం చేసే వ్యూహాలపై కూడా ఈ సమావేశంలో మంతనాలు జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ప్రతిపక్ష హోదా భయంతోనే నిరాకరించారంటూ పేర్ని నాని విమర్శలు
RELATED ARTICLES




