శుక్రవారం ఎన్టిఆర్ భవన్లో స్వర్గీయ నందమూరి హరికృష్ణ 7వ వర్థంతి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ, తెలంగాణ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నందమూరి హరికృష్ణ చిత్రపటానికి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న పొలిట్బ్యూరో సభ్యులు, జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు మాట్లాడుతూ… ఎన్టిఆర్ తెలుగుదేశం పార్టీని ప్రారంభించి ఉమ్మడి రాష్ట్రంలో వేల గ్రామాలలో చైతన్య రథంపై ప్రచారం చేసి 9 నెలల కాలంలోనే అధికారంలోకి రావడం జరిగింది. ఈ చైతన్య రథానికి సారధిగా ఉండి పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి హరికృష్ణ గారు కృషి చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టిఆర్ ప్రాతినిధ్యం వహించిన హిందూపురం శాసనసభ్యునిగా పని చేశారు. మంత్రిగా, రాజ్యసభ సభ్యునిగా సేవలను అందించారు. 2014లో 15 మంది టీడీపీ ఎమ్మెల్యేలను, 2018 ఎన్నికలలో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలను ప్రజలు గెలిపించారు. కానీ కంచె చేను మేసినట్లుగా పార్టీ తరపున గెలిచి ఇతర పార్టీలలోకి వెళ్లిపోయారు. పార్టీ కష్టాలలో ఉన్నప్పుడు కష్టపడి పని చేసిన వారిని గుర్తింపు ఇచ్చి గౌరవించుకుంటూనే యువతను చేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి గ్రామం, ప్రతి డివిజన్లలోనూ పార్టీ చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చ జరగాలి. ఎన్టిఆర్, నందమూరి హరికృష్ణ గార్ల ఆలోచనలను చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అందరం కలిసి సఫలం చేద్దాం. రాబోయే రోజులలో తెలుగుదేశం పార్టీ లేనిదే రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితులు రానున్నాయి.
రాష్ట్ర పార్టీ మాజీ ఉపాధ్యక్షురాలు, నందమూరి సుహాసిని మాట్లాడుతూ… ఎన్టిఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలలలో అధికారంలోకి రావడంలో నందమూరి హరికృష్ణ గారు చైతన్య రథసారధిగా కీలక పాత్రను వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టిఆర్కు వెన్నంటే ఉంటూ ఆయనను కంటికి రెప్పలా హరికృష్ణ గారు కాపాడుకుంటూ వచ్చారని అన్నారు. నేను ఉన్నానని కార్యకర్తలకు భరోసా ఇచ్చేవారని అన్నారు. ఎన్టిఆర్ బాటలోనే హరికృష్ణ గారు మహిళలకు ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. రవాణశాఖ మంత్రిగా మహిళలకు పెద్ద పీట వేస్తూ మొట్టమొదటిసారిగా ఆర్టీసీలో కండక్టర్లుగా అవకాశాలను కల్పించారని అన్నారు. ఆయనలాంటి కొడుకు ఎవరూ ఉండరని.. ఆయన లాంటి తండ్రి ఎవరూ ఉండరని అన్నారు. ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేనిదని అన్నారు.
చేవెళ్ల పార్లమెంట్ కన్వీనర్, కట్టా వెంకటేష్గౌడ్ మాట్లాడుతూ… నందమూరి హరికృష్ణ మనమధ్య లేకపోవడం దురదృష్టకరమని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నామని అన్నారు. పై లోకాల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ ఆయన ఆశీర్వదించి శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నామని అన్నారు. ఆయన లేని లోటు తీర్చలేనిదని అన్నారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర పార్టీ క్రమశిక్షణ కమిటీ బంటు వెంకటేశ్వర్లు, రాష్ట్ర పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి అజ్మీరా రాజునాయక్, పోలంపల్లి అశోక్, టీఎన్టీయూసీ నాయకులు రత్నాకర్రావు, ఎబిఆర్ మోహన్రావు, జగదీష్, తెలుగుయువత నాయకులు సాయి నాగార్జున, వంశీ, హరి సురేష్, వేణుగోపాల్, స్వాతి చౌదరి, సురేఖ, ఎంవిపి రమేష్బాబు, కృష్ణప్రసాద్, మండవ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
నందమూరి హరికృష్ణ సేవలు చిరస్మరణీయం – టీడీపీ నేతలు నివాళులు
RELATED ARTICLES




