సత్యనారాయణపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన ది. కనకమహాలక్ష్మి కో-ఆపరేటివ్ బ్యాంక్ 35వ బ్రాంచిని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ బుధవారం ఘనంగా ప్రారంభించారు. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు,టీడీపీ జిల్లా అధ్యక్షుడు, కేడీసిసి బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం, స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి రామ్ తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కొత్త బ్రాంచి కార్యకలాపాలను ప్రారంభించారు.
ఎంపీ కేశినేని శివనాథ్ స్వయంగా బ్యాంకులోని క్యాష్ కౌంటర్, లాకర్లను ప్రారంభించి సేవలను పరిశీలించారు. బ్రాంచి ప్రారంభోత్సవానికి హాజరైన ఎంపీ కేశినేని శివనాథ్ కు బ్యాంకు అధికారులు ఘన స్వాగతం పలుకగా, చైర్మన్ కొమ్మారెడ్డి రాంబాబు, సీఈఓ కె. శ్యామ్ కిషోర్, రీజినల్ మేనేజర్ జాస్తి మురళి, బ్రాంచ్ మేనేజర్ ఎం. లక్ష్మీనారాయణతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, కొమ్మారెడ్డి పట్టాభి, నెట్టెం రఘురామ్లను బ్యాంకు అధికారులు శాలువాలు కప్పి సన్మానించి, జ్ఞాపికలు అందించారు.
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ.. “ఖాతాదారులకు మెరుగైన సేవలను అందించడంలో కనకమహాలక్ష్మి కో-ఆపరేటివ్ బ్యాంకు ఎప్పుడూ అగ్రగామిగా నిలుస్తోంది. 35వ బ్రాంచ్ను సత్యనారాయణపురంలో ప్రారంభించడం ఆనందంగా ఉంది. భవిష్యత్తులో మరిన్ని బ్రాంచిలు ప్రారంభించి, ప్రజల నమ్మకాన్ని మరింత పెంచాలని ఆకాంక్షిస్తున్నాను” అని పేర్కొన్నారు.
అలాగే ఖాతాదారుల విశ్వాసాన్ని చూరగొన్న కనకమహాలక్ష్మి బ్యాంకు మరిన్ని బ్రాంచిలు ప్రారంభించి నేరుగా సేవలు అందించాలని ఎంపీ సూచించారు. బ్యాంకు చైర్మన్, సిబ్బందికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.
ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ..బ్యాంకు అభివృద్ధి, ఖాతాదారుల సంతృప్తి, సిబ్బందిలో క్రమశిక్షణను ప్రస్తావించి అభినందించారు. సహకార వ్యవస్థలో బ్యాంకులకు నానాటికి ఆదరణ పెరుగుతుందని, చిరు వ్యాపారులు, రైతులకు చక్కని సేవలు అందుతున్నాయని తెలిపారు. తన నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన కనుకమహాలక్ష్మి కో-ఆపరేటివ్ బ్యాంకు ప్రజలకు మరింత చేరువ కావాలని ఆకాంక్షించారు. బ్రాంచి పురోగతికి తన వంతు సహాయ, సహకారాలు ఎల్లప్పుడు అందిస్తానని హామీ ఇచ్చారు.
కేడిసిసి బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం మాట్లాడుతూ.. కనకమహాలక్ష్మి కో-ఆపరేటివ్ బ్యాంకు గత 26 ఏళ్లుగా సమర్థవంతమైన సేవలు అందిస్తుందని కొనియాడారు. నిబద్ధత, క్రమశిక్షణతో కనకమహాలక్ష్మి కో-ఆపరేటివ్ బ్యాంకు ఖాతాదారులకు సంతృప్తికరమైన సేవలు అందిస్తుందని తెలిపారు. రుణాల మంజూరు, రికవరీలో మంచి ఫలితాలు సాధిస్తూ, ఖాతాదారుల ఆకాంక్షల మేరకు సేవలందిస్తూ గుర్తింపు పొందాలని ఆయన సూచించారు.




