రాయలసీమ పారిశ్రామిక అభివృద్ధికి మరో కీలక అడుగు పడనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూలై 3న వైఎస్సార్ కడప జిల్లాలోని సున్నపురాళ్లపల్లి, పెద్దదండ్లూరు గ్రామాల వద్ద జేఎస్డబ్ల్యూ రాయలసీమ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. రూ.16,350 కోట్ల భారీ పెట్టుబడితో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్టు రాయలసీమ పారిశ్రామిక రంగంలో కొత్త అధ్యాయానికి నాంది పలకనుంది.జేఎస్డబ్ల్యూ ఆంధ్రప్రదేశ్ స్టీల్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సుమారు 1,100 ఎకరాల విస్తీర్ణంలో ఈ స్టీల్ ప్లాంట్ను రెండు దశల్లో అభివృద్ధి చేయనున్నారు. తొలి దశలో రూ.4,500 కోట్ల పెట్టుబడితో నిర్మాణ పనులు చేపట్టగా, రెండో దశలో మరో రూ.11,850 కోట్ల పెట్టుబడితో ప్లాంట్ విస్తరణ చేపడతారు. రెండు దశలు పూర్తయ్యాక వార్షికంగా 2 మిలియన్ టన్నుల (2 MTPA) ఉత్పత్తి సామర్థ్యాన్ని ఈ ప్లాంట్ కలిగి ఉంటుంది. 2028 మార్చి నాటికి వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించడమే లక్ష్యంగా ప్రభుత్వం, సంస్థ పనిచేస్తున్నాయి.
ఈ ప్రాజెక్టుకు తొలిసారిగా 2019లో ఆమోదం లభించగా, 2019, 2023లో శంకుస్థాపనలు జరిగినప్పటికీ నిర్మాణ పనులు ముందుకు సాగలేదు. 2024లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవ తీసుకుని జేఎస్డబ్ల్యూతో పలుమార్లు చర్చలు జరిపారు. పెండింగ్ సమస్యల పరిష్కారం, విధానపరమైన నిర్ణయాలు, శాఖల సమన్వయంతో ప్రాజెక్టును తిరిగి గాడిలో పెట్టి పూర్తి స్థాయి నిర్మాణ దశకు తీసుకొచ్చారు.స్టీల్ ప్లాంట్కు అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధిపైనా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్లాంట్కు నీటి సరఫరా కోసం ప్రత్యేక పైప్లైన్ ఏర్పాటు, జాతీయ రహదారి-67తో అనుసంధానం, ముద్దనూరు రైల్వే స్టేషన్ వరకు 12 కిలోమీటర్ల రైల్వే లింక్ నిర్మాణ పనులను కూడా చేపడుతోంది. ఈ రైల్వే ప్రాజెక్టు ప్రధానమంత్రి గతిశక్తి పథకం కింద రైట్స్ సంస్థ ద్వారా అమలు కానుంది.ప్రపంచ స్థాయి గ్రీన్ స్టీల్ ప్లాంట్గా రూపుదిద్దుకుంటున్న ఈ యూనిట్లో స్క్రాప్ ఆధారిత ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నెస్ (EAF) సాంకేతికతను వినియోగించనున్నారు. పునరుత్పాదక ఇంధన వనరులతో విద్యుత్ వినియోగం జరగడం వల్ల కార్బన్ ఉద్గారాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. పర్యావరణ హిత పరిశ్రమగా ఈ ప్రాజెక్టు నిలవనుంది.ఈ స్టీల్ ప్లాంట్ ద్వారా వేలాది ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు లభించడంతో పాటు అనుబంధ పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందనున్నాయి. రాయలసీమలో పెట్టుబడులు పెరగడంతో పాటు రాష్ట్ర పారిశ్రామిక వృద్ధికి ఈ ప్రాజెక్టు కీలకంగా మారనుంది. జూలై 3న ప్రారంభమయ్యే నిర్మాణ పనులు రాయలసీమ ఆర్థికాభివృద్ధి, పారిశ్రామిక ప్రగతికి కొత్త దిశను చూపనున్నాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.


