అమరావతి ఉండవల్లి గుహల వద్ద యోగా గురువు రామ్ దేవ్ బాబా నిర్వహించిన యోగాసాధన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తిలకించారు. యోగాంధ్ర లోగోతో కూడిన షర్ట్ ధరించి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. యోగాను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంలో రామ్ దేవ్ బాబా చేసిన కృషి ప్రశంసనీయమని అన్నారు. గత 30 ఏళ్లుగా రామ్ దేవ్ బాబాతో తనకు పరిచయం ఉందని, వేలాది మంది ఆయన వద్ద యోగా శిక్షణ పొందుతున్నారని తెలిపారు. చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన 6-7వ శతాబ్దానికి చెందిన ఉండవల్లి గుహల వద్ద యోగాసాధన నిర్వహించడం ప్రత్యేకమని పేర్కొన్నారు. అమరావతిని దేవతల రాజధాని స్ఫూర్తితో ప్రజా రాజధానిగా, నెట్ జీరో విధానంలో కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ప్రధాని మోదీ కృషితో యోగాకు అంతర్జాతీయ గుర్తింపు లభించిందని, ప్రపంచంలోని అనేక దేశాలు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయని తెలిపారు. టెక్నాలజీని వినియోగించుకుంటూనే ఆధ్యాత్మికత, యోగా ద్వారా సమతుల్య జీవన విధానాన్ని అలవరుచుకోవాలని సూచించారు. యోగా శరీరం, మనసును అనుసంధానం చేస్తుందని, ప్రస్తుత తరానికి యోగాసాధన అలవాటు చేస్తే ఆరోగ్యకరమైన భవిష్యత్తు అందించినట్లవుతుందని అన్నారు. రాష్ట్రంలో పచ్చదనం పెంపు, ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహం కోసం చర్యలు తీసుకుంటున్నామని, 20 లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు వస్తున్నారని తెలిపారు. ప్రజారోగ్యం కోసం అమలు చేస్తున్న సంజీవని కార్యక్రమంలో యోగా, ప్రాణాయామానికి ప్రాధాన్యత ఇస్తూ రోగ చికిత్స కంటే రోగ నివారణపై దృష్టి సారిస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
యోగాతో ఆరోగ్యకరమైన భవిష్యత్తు సాధ్యం: సీఎం చంద్రబాబు
Just drag and drop elements in a page to get started with Newspaper Theme.


