ఆంధ్రప్రదేశ్లో తోతాపురి మామిడి రైతుల అంశంపై రాజకీయ విమర్శలు మరింత వేడెక్కాయి. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో మామిడి రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేసిన పార్టీ, ఇప్పుడు రైతులపై ప్రేమ ఉన్నట్లు నటిస్తూ లేఖలు, నిరసనలు, రాజకీయ డ్రామాలు చేయడం హాస్యాస్పదమని ఆయన వ్యాఖ్యానించారు.
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో తోతాపురి మామిడి ధరలు కిలోకు రూ.2 వరకు పడిపోయినా రైతులను ఆదుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అచ్చెన్నాయుడు ఆరోపించారు. రైతులు తీవ్ర నష్టాల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని, కనీసం ఒక్క రూపాయి సబ్సిడీ కూడా ఇవ్వలేదని విమర్శించారు. రైతుల గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదని, దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమైతే తాము కూడా సిద్ధమని సవాల్ విసిరారు.
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కిలోకు రూ.4 చొప్పున ఆర్థిక సాయం ప్రకటించి, మొత్తం రూ.190 కోట్ల సహాయాన్ని అందించిందని మంత్రి తెలిపారు. రైతులకు మేలు జరుగుతుండటాన్ని జీర్ణించుకోలేక వైసీపీ ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తోందని ఆరోపించారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పల్ప్ ఫ్యాక్టరీల సిండికేట్ రైతుల నుంచి తోతాపురి మామిడిని కిలో రూ.3కే కొనుగోలు చేసి భారీ లాభాలు ఆర్జించిందని, ఆ సిండికేట్ వెనుక వైసీపీ నాయకుల ప్రమేయంపై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. నిజంగా రైతులపై చిత్తశుద్ధి ఉంటే ముందుగా రైతులను దోచుకుంటున్న సిండికేట్పై చర్యలు తీసుకోవాలని సూచించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి మామిడి రైతుల కోసం రూ.281 కోట్ల ఆర్థిక సహాయం కోరారని మంత్రి వెల్లడించారు. కేంద్రం స్పందించేలోపే రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసి రైతులకు కిలోకు రూ.4 చొప్పున సబ్సిడీ అందించిందని చెప్పారు.
ఉద్యాన రైతుల అభివృద్ధికి కూడా ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని అచ్చెన్నాయుడు తెలిపారు. గత ప్రభుత్వంలో పండ్ల సంరక్షణ కార్యక్రమాలకు పెద్దగా నిధులు కేటాయించలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ఏడాది రూ.3.5 కోట్లు, రెండో ఏడాది రూ.30 కోట్లు కేటాయించి ఉద్యాన రంగాన్ని బలోపేతం చేస్తోందని వివరించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 93,336 హెక్టార్లలో తోతాపురి మామిడి సాగు జరుగుతోందని, మొత్తం 8.84 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అంచనా ఉందన్నారు. ఇప్పటివరకు 4.42 లక్షల మెట్రిక్ టన్నుల కోత పూర్తయిందని, అందులో 2.57 లక్షల మెట్రిక్ టన్నులను పల్ప్ యూనిట్లు కొనుగోలు చేశాయని వెల్లడించారు.
కర్ణాటక ప్రభుత్వం అమలు చేస్తున్న Minimum Intervention Price (MIP), Price Deficiency Payment Scheme (PDPS) వంటి విధానాలను ప్రస్తావించిన మంత్రి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రైతుల ప్రయోజనాల కోసం కేంద్రంతో సమన్వయం చేస్తూ చర్యలు కొనసాగిస్తోందన్నారు. రైతుల సంక్షేమం విషయంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడదని, ప్రతి మామిడి రైతుకు అండగా నిలుస్తామని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.



