తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దెబ్బకు పలు జిల్లాలు అస్తవ్యస్తమవుతున్నాయి. ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో ఎన్నడూ లేని విధంగా కేవలం రెండు రోజుల్లోనే 36.8 సెం.మీ. రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా కామారెడ్డి పట్టణంలోని పెద్ద చెరువు ఉధృతంగా పొంగిపొర్లడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.వర్షాల ప్రభావంతో వంతెనలు కూలిపోవడం, కల్వర్టులు కొట్టుకుపోవడం, వాగులు పొంగిపోవడంతో పలు ఊళ్లు జలదిగ్బంధమయ్యాయి. రహదారులు దెబ్బతినడంతో వాహనాలు ఇరుక్కుపోయి గంటల కొద్దీ ట్రాఫిక్ స్తంభించిపోయింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పదుల సంఖ్యలో గ్రామాలు చీకటిలో మగ్గుతున్నాయి.ఈ పరిస్థితుల్లో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు ఇవాళ కామారెడ్డిలోని ముంపు ప్రభావిత ప్రాంతాలను సందర్శించనున్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అసెంబ్లీ సమావేశాలపై ఎమ్మెల్యేలతో సమావేశం అనంతరం ఆయన కామారెడ్డికి బయల్దేరి వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.ప్రజలను పరామర్శించి, బాధితులకు బీజేపీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వనున్నట్లు రామచందర్ రావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చించి వరద ప్రభావిత ప్రాంతాలకు తగిన సాయం అందేలా కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే కామారెడ్డిలో నెలకొన్న ఇబ్బందులపై ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి రామచందర్ రావుకు వివరాలు అందించినట్లు సమాచారం. కాగా, నిన్న మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ముంపు ప్రాంతాలను సందర్శించి పరిస్థితులను సమీక్షించారు.
కామారెడ్డిలో బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు రామచందర్ రావు
RELATED ARTICLES




