80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని వినాయక్ నగర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. వినాయక్ నగర్ మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని వినాయక్ నగర్ చౌరస్తా, లల్వని నగర్, కాకతీయ నగర్, చైనా బజార్, జేకే కాలనీ, వినోభా నగర్, శివ నగర్ ఫేస్-1, శివ నగర్ ఫేస్-2 ప్రాంతాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జాతీయ గీతాన్ని ఆలపించి జెండాకు వందనం చేశారు. అనంతరం స్థానిక ప్రజలకు 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని క్యానం రాజ్యలక్ష్మి అన్నారు. దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని, యువత దేశభక్తి, సేవాభావంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమాల్లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు, మహిళలు, యువత తదితరులు పాల్గొని జాతీయ జెండాకు వందనం చేశారు.


