హైదరాబాద్ నగరాన్ని కుదిపేసిన దారుణ సంఘటన కూకట్పల్లిలో చోటుచేసుకుంది. విశాఖ పట్నం నుంచి వలస వచ్చిన ఒక కుటుంబంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికులను విస్తుపోయేలా చేసింది. గేటెడ్ కమ్యూనిటీలోనూ భద్రతా లోపాలే ప్రధాన చర్చగా మారాయి.
కూకట్పల్లిలోని స్వాన్ లెక్ గేటెడ్ కమ్యూనిటీలో బుధవారం సాయంత్రం రేణు అగర్వాల్ అనే గృహిణి తన ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యారు. రేణు భర్త రాకేశ్ అగర్వాల్ సనత్ నగర్లో స్టీల్ షాప్ నడుపుతుండగా, వారి కుమారుడు శుభం కూడా ఆయనతో కలిసి బయటకు వెళ్ళాడు. ఈ క్రమంలో రేణు ఒంటరిగా ఇంట్లో ఉన్న సమయంలోనే హత్య జరిగింది.
పోలీసుల అనుమానాల ప్రకారం, ఈ దారుణానికి పాల్పడింది రేణు ఇంట్లో వంట మనిషిగా పని చేస్తున్న హర్ష్ అనే యువకుడే. అతనికి సహకరించిన మరో వ్యక్తి రోషన్. రోషన్ గత తొమ్మిది సంవత్సరాలుగా రేణు బంధువుల ఇంట్లో పనివాడిగా పనిచేస్తూ నమ్మకాన్ని సంపాదించాడు. అతడే ఇటీవల జార్ఖండ్కు చెందిన హర్ష్ను రేణు ఇంట్లో పనికి తీసుకొచ్చాడు.
కన్నింగ్ ప్లాన్ – డబ్బు కోసం దారుణం
పోలీసుల దర్యాప్తులో షాకింగ్ వివరాలు బయటపడ్డాయి. రేణు ఇంట్లో ఉన్న డబ్బు, నగల కోసం హర్ష్–రోషన్లు ముందే కుట్ర పన్నారు. బుధవారం ఉదయం రాకేశ్, శుభం బయటకు వెళ్ళిన తర్వాత ఈ ఇద్దరూ రేణుపై దాడి చేశారు.
మొదట రేణును బెదిరించి డబ్బు, నగలు ఎక్కడున్నాయో చెప్పమని చిత్రహింసలు పెట్టారు. కానీ ఆమె చెప్పకపోవడంతో కూరగాయల కత్తితో గొంతు కోసి, తలకు కుక్కర్తో బలంగా కొట్టి హత్య చేశారు. అనంతరం ఇంట్లోని లాకర్ను బద్దలు కొట్టి బంగారం, నగలు, నగదును సూట్కేసులో నింపుకుని పారిపోయారు.
చాకచక్యంగా మారిన నిందితులు
హత్య అనంతరం నిందితులు మరింత షాకింగ్గా వ్యవహరించారు. రక్తపు మరకలతో ఉన్న దుస్తులను ఇంట్లో వదిలేసి, అక్కడే స్నానం చేసి కొత్త దుస్తులు ధరించారు. అనంతరం ఇంటికి తాళం వేసి, రాకేశ్ కుటుంబానికి చెందిన స్కూటీపై పరారయ్యారు.
సీసీ కెమెరా ఫుటేజ్లో నిందితులు ఖాళీ చేతులతో లోపలికి వెళ్లి, సూట్కేసుతో బయటకు వచ్చినట్లు రికార్డు అయింది.
మృతదేహం బయటపడిన విధానం
సాయంత్రం 5 గంటల సమయంలో రాకేశ్, కుమారుడు శుభం రేణుకు ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో అనుమానం వచ్చి ఇంటికి చేరుకున్న రాకేశ్ తలుపు తట్టాడు. స్పందన రాకపోవడంతో ప్లంబర్ సహాయంతో వెనుక తలుపు తెరిపించాడు.
లోపలికి ప్రవేశించిన రాకేశ్ కంటికి భయంకర దృశ్యం పడింది. రేణు చేతులు, కాళ్లు తాళ్లతో కట్టేసి రక్తపు మడుగులో పడి కనిపించారు. ఆమె తల, శరీరంపై తీవ్రమైన గాయాలు ఉండటంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు రంగంలోకి
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్తో కలిసి ఆధారాలు సేకరించారు. ఫోరెన్సిక్ బృందం కూడా పరిశీలన జరిపింది. ప్రస్తుతం నిందితులైన హర్ష్, రోషన్ల కోసం 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు.
సమాజంలో కలకలం
ఈ ఘటనతో స్వాన్ లెక్ గేటెడ్ కమ్యూనిటీలో నివసించే ప్రజలు భయాందోళనకు గురయ్యారు. గేటెడ్ కమ్యూనిటీలోనూ ఇలాంటి ఘటన జరగడం భద్రతా లోపాలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. విశ్వసనీయంగా భావించి పనిలో పెట్టుకున్న వారే ప్రాణం తీశారనే విషయం అందరినీ కలచివేస్తోంది.




