”గతంలో సిద్ధం.. సిద్ధం.. అన్నారు, ఇప్పుడు అసెంబ్లీలో చర్చకు సిద్ధమా?” అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాజీ సీఎం వైఎస్ జగన్పై సూటిగా సవాల్ విసిరారు. అనంతపురంలో నిర్వహించిన ‘సూపర్ సిక్స్ – సూపర్ హిట్’ విజయోత్సవ సభలో పాల్గొన్న ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు.
చంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోతుందని, అందుకే ఆ పార్టీ నేతలు అసెంబ్లీకి రాకుండా బయట రచ్చ చేస్తున్నారని అన్నారు. “వాళ్ల బెదిరింపులకు ఎవరూ భయపడరు. ఇక్కడ ఉన్నది ఎన్సీబీ, పవన్ కల్యాణ్” అని కఠినంగా వ్యాఖ్యానించారు.
హింసా రాజకీయాలపై స్పందిస్తూ, “హింసను ప్రేరేపించే వారిని ఎక్కడ ఉన్నా వదిలిపెట్టం. గుర్తుంచుకోండి.. ఇక్కడ నేను, పవన్ కల్యాణ్ ఉన్నాం” అని హెచ్చరించారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలని, తమది కాదని అన్నారు.
వైసీపీ కార్యకలాపాలను ఎద్దేవా చేస్తూ, “ఆఫీసులు మూసేసుకుని సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు. కానీ ఒంటిమిట్ట, పులివెందులలోనే ప్రజలు వైసీపీకి గట్టిగా చెబుతున్నారు” అని విమర్శించారు.
అలాగే మెడికల్ కాలేజీల అంశంపై జగన్ను టార్గెట్ చేశారు. “అసలు మెడికల్ కాలేజీ అంటే ఏంటో కూడా తెలియని వ్యక్తి వాటి గురించి మాట్లాడుతున్నారు. కేవలం భూమి కేటాయించి, పునాది రాయి వేయగానే అది మెడికల్ కాలేజీ అయిపోదు” అని అన్నారు.
గత ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలకు శంకుస్థాపనలు చేసి వదిలేసిందని, వాటిలో ఒక్కటే పూర్తయిందని వెల్లడించారు. అసెంబ్లీలో చర్చకు వస్తే ఎవరు ఏమి చేశారో ప్రజలకు తెలిసిపోతుందని చంద్రబాబు స్పష్టం చేశారు.




