రాష్ట్రంలో రానున్న వ్యవసాయ సీజన్లో ఎల్నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో పశుసంపద రక్షణకు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టిందని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. వర్షాభావ పరిస్థితుల్లో పశువులకు పచ్చిమేత కొరత రాకుండా చూసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.ప్రకృతి వ్యవసాయ విధానాల ద్వారా పశుగ్రాసాల సాగును ప్రోత్సహించే లక్ష్యంతో రూపొందించిన “ప్రీమాన్సూన్ డ్రై సోయింగ్” (పీఎండీఎస్) అవగాహన కరపత్రాలను మంత్రి అచ్చెన్నాయుడు మంగళవారం విజయవాడలోని తన కార్యాలయంలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వాతావరణ మార్పులు వ్యవసాయ రంగంతో పాటు పశుసంపదపై కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు, పశుపోషకులు ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని సూచించారు.తక్కువ వర్షపాతం నమోదైనప్పటికీ ప్రకృతి వ్యవసాయ సాంకేతిక పద్ధతులను అనుసరించడం ద్వారా మంచి పశుగ్రాస దిగుబడులు సాధించే అవకాశం ఉందన్నారు. పచ్చిమేత ఉత్పత్తి, పశుగ్రాస నిల్వ, తాగునీటి సదుపాయాలు, పశువుల ఆరోగ్య పరిరక్షణ వంటి అంశాలపై రైతులకు పూర్తి అవగాహన కల్పిస్తామని తెలిపారు.గ్రామ స్థాయిలో పశుసంవర్ధక శాఖ సిబ్బంది ద్వారా ఈ కరపత్రాలను రైతులు, పశుపోషకులకు పంపిణీ చేసి విస్తృత ప్రచారం చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు. పశుసంపద గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలక భాగమని, దాని పరిరక్షణకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు. ఎలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఎదురైనా రైతులు, పశుపోషకులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.పశుసంవర్ధక శాఖ సంచాలకులు డా. టి. దామోదర నాయుడు మాట్లాడుతూ.. వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు తీసుకోవడం ద్వారా పశుసంపదను సమర్థవంతంగా రక్షించుకోవచ్చన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతుల్లో అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వివరించారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పీతల సుజాత, పశుసంవర్ధక శాఖ సంచాలకులు డా. టి. దామోదర నాయుడు, శాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
వర్షాభావ పరిస్థితుల్లోనూ పశుసంపద రక్షణకు ముందస్తు చర్యలు: మంత్రి అచ్చెన్నాయుడు
Just drag and drop elements in a page to get started with Newspaper Theme.


